టైగర్ కంపెనీ ప్రొడక్షన్స్ పతాకంపై సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ అందిస్తున్న తాజా చిత్రం 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు'. సిద్ధార్థ తాతోలు దర్శకత్వం వహించిన ఈ చిత్రం శుక్రవారం విడుదల కావాల్సి ఉండగా సెన్సార్ కారణాల వల్ల రిలీజ్ కాలేదు. అయితే ఈ సినిమా పేరును 'అమ్మరాజ్యంలో కడపబిడ్డలు'గా మార్చారు. ఈ సందర్భంగా హైదరాబాద్లోని ప్రసాద్ ల్యాబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాంగోపాల్ వర్మ మాట్లాడుతూ – “అమ్మరాజ్యంలో కడపబిడ్డలు ఓ మెసేజ్ ఓరియంటెడ్ సినిమా. ఏ విషయాన్ని సీరియస్గా తీసుకోవద్దనే సందేశంతో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో ఏ కులాన్ని కానీ ఏ వర్గాన్ని కానీ తక్కువ చేసి చూపలేదు. సిఎంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రమాణస్వీకారోత్సవం తరువాత జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా కథ సిద్ధం చేశాను.
నేను ఎవరినీ టార్గెట్ చేసి తీసిన సినిమా కాదు ఇది. కేవలం నాకు ఆసక్తికరంగా అనిపించిన పాయింట్తో మాత్రమే ఈ సినిమాను తెరకెక్కించాను. మామూలు క్రైమ్ కన్నా పొలిటికల్ క్రైమ్ మరింత ఆసక్తికరంగా ఉంటుంది. అందుకనే ఈమధ్య ఆ తరహా సినిమాలు నన్ను ఎక్కువగా ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమాలో ముందు ఒక లైన్ వస్తుంది 'మే 2019 నుండి సెప్టెంబర్ 2020 వరకూ జరిగిన ఘటనల ఆధారంగా' అని. జరిగిన, జరుగుతున్న సంఘటనల ఆధారంగా… జరుగబోయే అంశాలను ఈ సినిమాలో ఊహించి చెప్పడం జరిగింది. సెన్సార్ రూల్ ప్రకారం చూస్తే .. ఏ సినిమా రిలీజ్ కాదు. కానీ అన్ని రూల్స్ను నా సినిమా మీదే ఎందుకు ప్రయోగిస్తున్నారో అర్ధం కావడం లేదు. ఎవరినైనా ప్రేమించడానికి లేదా ద్వేషించడానికి నా దగ్గర సమయం లేదు. ఒక సినిమా ట్రైలర్ చూసి ప్రేక్షకులు సినిమా చూడాలి అని ఫిక్స్ అయితే విడుదల ఆలస్యమైనా తప్పక చూస్తారు.
నన్ను ఎంత గట్టిగా ఆపితే అంత గట్టిగా పైకి లేస్తాను. అందుకే ఈ సినిమాకు సీక్వెల్ కూడా ప్లాన్ చేస్తున్నాను. త్వరలోనే మా ప్రొడక్షన్ నుండి 'బ్యూటిఫుల్' అనే లవ్ స్టోరీ వస్తుంది”అని అన్నారు. నిర్మాత నట్టి కుమార్ మాట్లాడుతూ – “మా సినిమాను నవంబర్ 29న విడుదల చేయాలంటే అర్జెన్సీ సర్టిఫికెట్ కావాలన్నారు. దాన్ని పొందుపరిచి నవంబర్14న సెన్సార్కు దరఖాస్తు చేశాం. అందుకే మేము రిలీజ్ డేట్ కూడా ప్రకటించడం జరిగింది. కానీ సెన్సార్ వారు ఎలాంటి కారణం చూపకుండా ఇంతవరకు సినిమా చూడలేదు. ఈ సందర్భంగా నా మనవి ఏంటంటే సినిమా చూసిన తరువాత ఏది చెపితే … రూల్స్ ప్రకారం అది మేము ఫాలో అవుతాము. అయితే మేము కోర్ట్ను ఆశ్రయించడం జరిగింది. చీఫ్ జస్టిస్ గురువారం నుండి ఏడు రోజుల లోపల సినిమా చూసి ఎగ్జామినేషన్ చేయాలనీ ఆర్డర్ పాస్ చేశారు. సెన్సార్ కారణం వల్లే రిలీజ్ డేట్ వాయిదా వేయడం జరిగింది. త్వరలోనే కొత్త డేట్ ప్రకటిస్తాం”అని తెలిపారు. ఈ సమావేశంలో నిర్మాత అజయ్ మైసూర్ పాల్గొన్నారు.